Thursday, January 13, 2011

అస్థిరమే! అవును.. పరిస్థితి ఫ్లూయిడ్‌గా ఉంది.

ఎవరుంటారో, ఎవరు పోతారో? ఏం చేస్తే ఏమవుతుందో
ఆలోచించి అడుగు వేయాలి.. సరైన సమయంలో సరైన నిర్ణయం

ఎలా గెలిచారో వాళ్లు గుర్తుంచుకోవాలి
రాజకీయాలకే సరిపోతోంది
పాలనపై దృష్టి పెట్టలేకపోతున్నా
ఏం చేయాలో వంద రోజుల్లో నిర్ణయం
డీసీసీ అధ్యక్షుల భేటీలో సీఎం కిరణ్
మన కన్ను మనమే పొడుచుకోవద్దు
ఐక్యంగా పార్టీని బలోపేతం చేయాలి
కర్తవ్య బోధ చేసిన డి. శ్రీనివాస్
హైదరాబాద్, జనవరి 12 : అవును... రాష్ట్ర కాంగ్రెస్‌లో అస్థిర పరిస్థితి ఉంది... ఎవరో కాదు! స్వయంగా ప్రభుత్వ సారథి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ విషయాన్ని అంగీకరించారు. వైఎస్ జగన్ వాడి, తెలంగాణ వేడి మధ్య పార్టీ నలిగిపోతున్నట్లు చెప్పకనే చెప్పారు. 'గీత దాటుతున్న వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదు? జగన్‌కు బాహాటంగా మద్దతు ఇస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నా ఎందుకు స్పందించడం లేదు?'' అని నిలదీసిన నేతలకు ముఖ్యమంత్రిగానీ, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌గానీ తగిన సమాధానమివ్వలేకపోయారు.

బుధవారం గాంధీ భవన్‌లో జరిగిన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ), నగర కాంగ్రెస్ కమిటీ (సీసీసీ) అధ్యక్షుల సమావేశంలో కిరణ్, డీఎస్ పాల్గొన్నారు. వారికి పరిస్థితి వివరిస్తూ, కొంత ధైర్యం చెబుతూ, కర్తవ్య బోధ చేశారు. క్రమశిక్షణ చర్యలపై అధిష్ఠానం ఆదేశాల మేరకు నిర్ణయాలు తీసుకుంటామని సీఎం చెప్పారు. విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఇవీ ఆ భేటీ వివరాలు... "ప్రస్తుతం కాంగ్రెస్‌లో అస్థిర పరిస్థితి (ఫ్లూయిడ్) ఉంది. ఎవరు ఉంటారో, ఎవరు వెళ్లిపోతారో తెలియడం లేదు'' అని ముఖ్యమంత్రి కిరణ్ పేర్కొన్నారు. అదే సమయంలో పార్టీని ఎవరు వదిలి వెళ్లినా నష్టమేమీ లేదని ధీమా వ్యక్తం చేశారు.

ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి 30 శాతం ఓటు బ్యాంకు ఉందని తెలిపారు. పార్టీలో ఎప్పుడు ఏం చేయాలో ఆలోచించి చేయాల్సి ఉంటుందని, ఎవరు ఎలా ఉంటారో చూడాల్సి ఉందని అన్నారు. జగన్ వైపు చూస్తున్న నేతలకు పరోక్షంగా చురకలు అంటించారు. "ఎన్నికల సమయంలో టికెట్ ఇచ్చాకే వీరు ప్రజా ప్రతినిధులుగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే జనం గెలిపించారని వీళ్లంతా గుర్తుంచు కోవాలి'' అని ముఖ్యమంత్రి తెలిపారు. త్వరలో వడపోత కార్యక్రమం ఉంటుందని కూడా తెలిపారు. ఊరూరా పార్టీకి కార్యకర్తలున్నారని, వారిని బలోపేతం చేసుకోవాలని సూచించారు.

"ఎమ్మెల్యేలు పోయినప్పటికీ... మేం కాంగ్రెస్‌లోనే ఉన్నామని జడ్పీటీసీ, ఎంపీటీసీలు చెబుతున్నారు. మన పార్టీని ఎవరూ దెబ్బతీయలేరు. విధానాలే ప్రజలను ప్రభావితం చేస్తాయి. వచ్చే వంద రోజుల్లో ఏం చేయాలో నిర్ణయిస్తాం. పార్టీ ద్వారా వాటిని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలన్నది ఆలోచిస్తాం'' అని భవిష్యత్ కార్యాచరణ గురించి వివరించారు. త్వరలో జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఏదైనా లక్ష్యం సాధించడానికి సూక్ష్మ స్థాయి ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉందన్నారు.

రాజకీయాలతోనే సరి...

ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందని, పరిపాలనపై పూర్తిగా దృష్టి సారించలేకపోతున్నానని కిరణ్ పేర్కొన్నారు. "కొన్ని రోజుల్లోనే పరిస్థితులు చక్కబడతాయి. పరిపాలనలోకి వస్తా. పరిపాలనపై దృష్టి సారిస్తా. సోనియాగాంధీ పాలనలో పారదర్శకతను కోరుతున్నారు. కార్యకర్తలతో కలసి మెలసి ఉండాలని సూచించారు.

తొలుత... ఆలోచనల్లో స్పష్ట రావాలి. పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నారో, పోయారో తెలియాలి. మన పార్టీలో చాలా మంది నాయకులు ఉన్నారు. ఎక్స్ పోతే వై .. వై పోతే జడ్ ఆ లోటును భర్తీ చేస్తారు'' అని వివరించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రులు నెలలో ఒకరోజు జిల్లా పార్టీ కార్యాలయానికి, నియోజకవర్గ కార్యాలయాలకు వెళ్లాలని సూచించారు. "ఒకటి రెండు నెలల్లో అంతా సర్దుకుంటుంది. ఓపికతో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం' అని ముఖ్యమంత్రి తెలిపారు.

సీరియస్‌గా తీసుకోండి: డీస్

ముఖ్యమంత్రికంటే ముందు పీసీసీ చీఫ్ డీఎస్ మాట్లాడారు. పార్టీని బలహీనం చేసే ప్రయత్నాలను సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. "వాళ్లతో అయ్యేదేంటని ఊరుకోవద్దు. సీరియస్‌గా తీసుకోవాలి. పార్టీ పునాదులకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. కార్యకర్తల కృషి కారణంగానే అధికారంలోకి వచ్చాం. దానిని కాపాడుకోవాలి. మన కంటిని మనమే పొడుచుకోవద్దు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే వాడే నాయకుడు అవుతాడు. మనకు అంకిత భావం ఉంటే ఎదుగుతాం. లేకుంటే కనుమరుగై పోతాం. ఈ తరం రాజకీయ నాయకుల ఆకాంక్షలు, కోర్కెలు, అవరాలు ఏమిటో ముఖ్యమంత్రికి బాగా తెలుసు'' అని డీఎస్ తెలిపారు.

డీసీసీ అధ్యక్షులుగా పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. "కాంగ్రెస్ పార్టీ బలహీనపడితే... మీరూ బలహీనపడతారు. అందరం కలసి పార్టీని బలోపేతం చేయాలి. పార్టీకి సంబంధించిన సమస్యలు ఉంటే నాకు, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలుంటే ముఖ్యమంత్రికి చెప్పండి'' అని సూచించారు. వైఎస్ చేపట్టిన కార్యక్రమాలన్నీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలేనన్నారు. "నేను రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిని అయినా... డీసీసీ అధ్యక్షుడిని కావాలన్న నా కోరిక నెరవేరలేదు. మీరు అదృష్టవంతులు. డీసీసీ, సీసీసీ అధ్యక్షులు అయ్యారు.

అందర్నీ సమన్వయ పరచాలి. అన్ని విభాగాలు, వర్గాలను కలుపుకొని ముందుకు తీసుకువెళ్లాలి. కాంగ్రెస్ అనే పదం ప్రజల నోటి మీద నానుతున్నా.. దానిని మనం ఇంకా విస్తృతం చేయాలి'' అని హితవు పలికారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు తీరును సమీక్షించాల్సి ఉందన్నారు. ఈ పథకాల అమలుపై 17-18 పాయింట్‌లు రూపొందించి .. జిల్లా వారీ పర్యవేక్షక కమిటీలను వేయాల్సి ఉందని... దీనికి సంబంధించి ఈనెల 25 లోగా జిల్లా కాంగ్రెస్ కమిటీల నుంచి పేర్లను పంపాలని డీఎస్ సూచించారు.

ప్రశ్నలు... నిలదీతలు...

ఈ భేటీలో ముఖ్యమంత్రిని, పీసీసీ చీఫ్‌ను పలువురు నేతలు ప్రశ్నలతో నిలదీశారు. "జిల్లాల్లో పర్యవేక్షక కమిటీలు వేస్తామంటున్నారు. కానీ... మేం కాంగ్రెస్ పార్టీ నేతలమని చెబుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదు'' అని గౌరీ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిమీద క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. "నేను యువజన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు జాతీయస్థాయి యువజన కాంగ్రెస్ నాయకుడిని కొట్టాను. దీనిని అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుని... నన్ను సస్పెండ్ చేసింది.

ఇప్పుడు బాహాటంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు?'' అని గౌరీ శంకర్ ప్రశ్నించారు. మూడేళ్లుగా కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొందని పీసీసీ ప్రధాన కార్యదర్శి నిరంజన్ అన్నారు. నామినేటెడ్ పదవుల విషయానికి వస్తే ఇదిగో అదిగో అంటూ కాలక్షేపం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్ రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినందున, ఎవరి పని తీరు ఏమిటో బాగా తెలిసినందున, పదవులపై సీఎంకు పీసీసీ నుంచే పేర్లను పంపాలని నిరంజన్ కోరారు.

ఈ సమయంలో మంత్రి దానం నాగేందర్ జోక్యం చేసుకుని... పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ వెంట వెళ్తున్న ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నేతి విద్యాసాగర్ కూడా ప్రశ్నించారు. నిజమైన కార్యకర్తలకు భరోసా దక్కడం లేదని రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు కేఎం ప్రతాప్ అన్నారు. ప్రధానంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి పార్టీ కార్యకర్తలకంటే బయటి వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ఎమ్మెల్యే ప్రసాద్ చేసిన సూచనలు పెడచెవిన పెట్టి రేషన్ షాపు డీలర్లతో సహా అన్ని అవకాశాలు, పదవులు బయటి వక్తులకే అప్పగించారు. పదవులు పొందిన మరుక్షణమే వారు జగన్ వెంట కన్పిస్తున్నారు'' అని ప్రతాప్ పేర్కొన్నారు. ఇలాంటివి సరిదిద్దేందుకే సమన్వయ కమిటీలను వేస్తామంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలకూ మధ్య సమన్వయం లేదని.. రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబుకు ఈ విషయాన్ని చెబుతామని సీఎం హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి మాట!

పార్టీ నేతల్లో సమన్వయం కొరవడింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య సమన్వయం లేక పోవడం నిజమే! నాయకునికి సెంటిమెంట్, కమిట్‌మెంట్ అనే అంశాలు ఉన్నాయి. మనతో ఎవరున్నారో, ఎవరు లేరో చూసుకోవాలి. ఏదైనా చేసినా (పదవుల వంటివి ఇస్తే) ఉంటారో, పోతారో తెలీదు. పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల, లేని చోట్ల కూడా ఇబ్బందులున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలకూ పడదు. మంత్రులకూ ఎమ్మెల్యేలకూ పడడం లేదు.
- డీసీసీ అధ్యక్షుల భేటీలో సీఎం కిరణ్
Click Here!

No comments:

Post a Comment