Thursday, January 27, 2011

.. అదే శ్రీరామ రక్ష

 
సాంకేతికంగా మైనార్టీలో కిరణ్ సర్కార్
అయినా మనుగడకు ముప్పు లేనట్టే

కాస్కో.. చూస్కో.. అన్నవాళ్లే కానీ..
(అ) విశ్వాసంపై సవాళ్ల అంతరార్థం ఇదే
ప్రత్యర్థుల అనైక్యతే పాలకపక్షం బలం
జగన్ శిబిరంలో తగ్గుతున్న ఎమ్మెల్యేలు
బల పరీక్షకు యువనేత వెనుకంజ
రాష్ట్ర రాజకీయాల్లో విచిత్ర పరిస్థితి 
రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయంగా ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. సంఖ్యాపరంగా చూస్తే ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. కానీ ప్రభుత్వం పడిపోదు. కిరణ్ సర్కార్‌పై అటు ప్రధాన ప్రతిపక్షం .. ఇటు కాంగ్రెస్‌లోని ఓ వర్గం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. కానీ.. అవిశ్వాస తీర్మానం పెట్టవు. దమ్ముంటే విశ్వాస తీర్మానం పెట్టుకోండి అని జగన్ వర్గం.. చేతనైతే అవిశ్వాస తీర్మానం పెట్టండని ప్రభుత్వ వర్గం పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నాయి. కానీ ఎవరూ ఆ పని చేయరు.

కిరణ్ ప్రభుత్వాన్ని దించేయాలన్న కసి పీకలదాకా ఉన్నా జగన్ వర్గం ఆ సాహసం చేయలేకపోతోంది. తన వల్ల కాదని గట్టిగా నిర్ధారించుకుని చంద్రబాబును రెచ్చగొట్టే ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. ప్రత్యర్ధుల బలహీనతలు కిరణ్ పాలిట వరాలుగా మారాయి. పిల్లి మెడలో గంట కొట్టేవారు కరువయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రెక్కల కష్టమని.. అందువల్ల దానిని 2014 వరకూ పడగొట్టబోమంటూ ఒకవైపు జగన్ వర్గ శాసనసభ్యులు ఘంటాపథంగా చెబుతూనే మరోపక్క దమ్ముంటే కిరణ్ సర్కారు విశ్వాస పరీక్షకు సిద్ధం కావాలని సవాల్ విసురుతున్నారు.

పరస్పర విరుద్ధంగా ఉన్న ఈ ప్రకటనల నేపథ్యంలో విశ్వాస పరీక్షకు వ్యతిరేకంగా ఓటు వేస్తారా అనే ప్రశ్నకు .. తాము 2014 వరకూ ఈ ప్రభుత్వానికి కూల్చకూడదన్న నిర్ణయంతో ఉన్నందున తాము వ్యతిరేకంగా ఓటు వేయమని ఒకసారి, చూద్దాం.. అని మరోసారి చెప్పడం మినహా స్పష్టంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పలేకపోతున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై నమ్మకం లేదంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ నమ్మకం లేనప్పుడు అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టడం లేదన్న ప్రశ్నకు వైఎస్ కష్టంతో వచ్చిన ప్రభుత్వంపై ఆవిశ్వాసం ఎలా పెడతామని ప్రశ్నిస్తున్నారు.

కడప మాజీ ఎంపీ వైఎస్ జగన్మోహనరెడ్డి రాజకీయపార్టీని స్థాపించిన తర్వాతైనా కిరణ్ సర్కారును కూల్చేస్తారా అనే ప్రశ్నకు పార్టీ పెట్టాక జగన్ ఎలా అదేశిస్తే అలా చేస్తామని చెబుతున్నారు. ఒకే సమయంలో పరస్పర విరుద్ధంగా జగన్ వర్గ ఎమ్మెల్యేలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం జగన్ వర్గంలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం క్రమంగా తగ్గుతుండడమేనని అంటున్నారు. జగన్ విజయవాడలో జరిగిన లక్ష్య దీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలతో తన బల పరీక్ష చేశారు. ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలు (పీఆర్పీ ఇద్దరు, టీడీపీ ఒకరు సహా) జగన్ వెంట నిలిచారు.

ఆ తదుపరి ఢిల్లీలో జరిగిన 'జల దీక్ష'లో ఆ సంఖ్య 24గా (పీఆర్పీ ఇద్దరు, టీడీపీ ఒకరు సహా) ఉంది. మొన్న పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్.. వైజాగ్‌లో జనదీక్ష చేశారు. ఆ దీక్షకు 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. బుధవారం జగన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కేవలం ఎనిమిది మందే పాల్గొన్నారు. మిగిలిన వారు వేర్వేరు కారణాల రీత్యా హాజరు కాలేక పోయారని జగన్ వర్గం చెబుతోంది. ఆ కారణాలేంటన్నది పక్కన పెడితే.. అటు జగన్ వర్గం ఎమ్మెల్యేలు సమావేశం అయిన రోజే.. ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్ చేజారిపోయారు.

సీఎం కిరణ్‌కుమార్‌ను కలిసిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుంజా సత్యవతి, రేగా కాంతారావులు.. తాము కాంగ్రెస్‌తోనే ఉంటామని స్పష్టం చేశారు. వీరిద్దరినీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి సీఎం వద్దకు తీసుకుపోయారు. అటు.. చిత్తూరు జిల్లాలో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు కుతూహలమ్మ, పీ రవిలను బుజ్జగించే ప్రయత్నాలను మంత్రి రఘువీరారెడ్డి భుజాలకెత్తుకున్నారు. తనతో సీఎం నేరుగా మాట్లాడాలని కుతూహలమ్మ డిమాండ్ చేస్తే.. రవి మాత్రం మెత్తబడ్డారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు రచ్చబండ కార్యక్రమంలో తొలి రోజు పలువురు జగన్ వర్గం ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతితో సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు కూడా.

ఇవన్నీ జగన్ బలం తగ్గుతున్నాయనేందుకు సంకేతాలుగా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా జగన్ వర్గం నుంచి రోజు రోజుకూ ఎమ్మెల్యేలు జారిపోతున్నారన్నది మాత్రం కనిపిస్తున్న వాస్తవం. అయితే.. బాహాటంగా 30 మంది వరకూ ఎమ్మెల్యేలు జగన్‌కు మద్దతు ఇస్తున్నారని, అంతర్గతంగా వారి సంఖ్య 50 వరకూ ఉంటుందని జగన్ వర్గం నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అంటున్నారు. ఆయన చెప్పినట్లు 50 మంది అవిశ్వాసం వ్యక్తం చేసినా కిరణ్ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చే ముప్పేమీ లేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇందుకు టీడీపీ, టీఆర్ఎస్‌లు రాజకీయంగా అనుసరించే వ్యూహాలే ప్రధాన కారణం. రాజకీయంగా జగన్‌ను టీడీపీ వ్యతిరేకిస్తోంది.

తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో జగన్‌కు టీఆర్ఎస్ సహకరించే పరిస్థితి లేదు. కిరణ్ సర్కార్‌పై పీకలవరకూ టీడీపీకి కోపం ఉన్నా.. జగన్ వర్గం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే, అందుకు ఆ పార్టీ సహకరించదు. రాజకీయంగా జగన్‌కు టీడీపీ సహకరిస్తే భవిష్యత్‌లో జగన్‌పార్టీని విమర్శించే నైతిక హక్కును టీడీపీ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. పైగా దాని వల్ల రాజకీయంగా గట్టి ఎదురు దెబ్బ తగులుతుంది. దీనికి తోడు జగన్ అక్రమాస్తులపై టీడీపీ పోరాటం చేస్తోంది. అందువల్ల జగన్ వర్గం అవిశ్వాస తీర్మానం పెట్టినా అందుకు టీడీపీ ఏ మాత్రం సహకరించదు. ఇదే సమయంలో కిరణ్ సర్కారు కూలుతుందని.. మధ్యంతరం తప్పదని పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్న టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు పరిస్థితీ ఇంచుమించు ఇదే విధంగా ఉంటుందని రాజకీయ వర్గాల ఉవాచ.

తెలంగాణ ఆకాంక్ష బలీయంగా ఉన్న ఈ పరిస్థితుల్లో మధ్యంతరం వస్తే రాజకీయంగా టీఆర్ఎస్‌కు ఎంతో లాభిస్తుంది. అయితే.. కరడుగట్టిన సమైక్యవాదిగా ముద్ర పడ్డ జగన్‌వర్గం కిరణ్ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెడితే, ఆ తీర్మానానికి సానుకూలంగా ఓటు వేస్తే.. రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలే వీలుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సమైక్యరాష్ట్రాన్ని కోరుతూ రాసిన ప్లకార్డును లోక్‌సభలో టీడీపీ ఎంపీల చేతి నుంచి లాక్కొని మరీ ప్రదర్శించినందుకు జగన్‌ను తెలంగాణలో తిరగకుండా టీఆర్ఎస్ అడ్డుపడింది.

కాంగ్రెస్ నుంచి వేరుపడిన జగన్ సర్వ స్వతంత్రుడు. ఇదివరలో అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి అలా చేశానని చెప్పి జగన్ తప్పించుకునే వీలుంది. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ నుంచి వేరుపడి సొంత పార్టీని పెడుతున్నందున జగన్ రాష్ట్ర విభజనపై తన నిర్ణయాన్ని స్పష్టం చేయాల్సి ఉంది. తాను తెలంగాణకు సానుకూలమని బహిరంగంగా ప్రకటించనంతకాలం జగన్‌పై సమైక్య ముద్ర ప్రభావం గట్టిగా ఉంటుంది. సీమాంధ్ర ప్రాంతంలో పట్టుకోసం ప్రయత్నిస్తున్న జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజనకు అంగీకరించరు.

ఆయన అంగీకరించనంత కాలం టీఆర్ఎస్ బహిరంగంగా మద్దతును తెలిపేందుకు అవకాశం ఉండదు. జగన్‌వర్గం పెట్టే అవిశ్వాసానికి మద్దతును తెలిపితే.. గతంలో లోక్‌సభలో ప్లకార్డును ప్రదర్శించినందుకే.. తెలంగాణ ప్రాంతంలో తిరగనివ్వకుండా అడ్డుకుని, ఇప్పుడు ఎందుకు కలిసిపోయారో? లోపాయికారీ ఒప్పందం ఏమిటో? వివరించాలని తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ నేతలు నిలదీసే అవకాశం ఉంది. ఇది రాజకీయంగా కాస్త ఇబ్బందికరమైన పరిణామమే అయినందున టీఆర్ఎస్ కూడా మౌనం దాల్చే వీలుంది.

రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు రాజకీయంగా తనకు సానుకూలంగా ఉండడంతో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి నెత్తి కింద తడిగుడ్డ వేసుకుని హాయిగా ఉండే పరిస్థితులు కన్పిస్తున్నాయని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. అయినా సరే.. అంకెల పోరాటానికే పరిణామాలు దారి తీసినా.. పొరుగు రాష్ట్రాల అనుభవంతో గట్టెక్కే ధీమా కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. అమీ తుమీకి సిద్ధమైనప్పుడు జగన్ వర్గంలోని కనీసం 20 మందిపై వేటు వేస్తే సభలో వాస్తవ బలం 273కు పడిపోతుంది. అంటే 137 అనేది మ్యాజిక్ ఫిగర్‌గా నిలుస్తుంది.

కాంగ్రెస్ బలం 135గా ఉంటుంది. అంటే మెజార్టీకి రెండు స్థానాలు తక్కువ. అయితే.. పీఆర్పీ నుంచి కనీసం 14 మంది, ఎంఐఎం నుంచి ఏడుగురు సర్కారును ఆదుకునేందుకు ఆస్కారం ఉంది. పైగా జగన్‌ను వ్యతిరేకించే విపక్షాలు సైతం కిరణ్ సర్కారును వ్యూహాత్మకంగా బయటపడేసినా ఆశ్చర్యం లేదు. ఈ లెక్కన చూస్తే బాలినేని చెప్పినట్లు 50 మంది ఎమ్మెల్యేలు జగన్ వర్గంలో చేరినా.. కిరణ్ కుర్చీలో ఏమాత్రం కదలికలు రావన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.

కొసమెరుపు : సాధారణంగా ఏ ప్రభుత్వమైనా తన సొంత బలంపైనే నిలబడుతుంది. కానీ రాష్ట్రంలో కిరణ్ సర్కారు విషయంలో ఇది పూర్తి భిన్నంగా ఉంది. అసెంబ్లీలో సాంకేతికంగా జగన్ వర్గం ఎమ్మెల్యేల మద్దతుపైనా, రాజకీయంగా విపక్షాల పరోక్ష సహకారం మీద కిరణ్ సర్కార్ మనుగడ సాగిస్తుండటమే ఇక్కడ రాజకీయ వైచిత్రి!!
Click Here! 
(అ)విశ్వాసమా ? వినోదమా ?
assemblys
కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస/విశ్వాస తీర్మాన వ్యవహారం చివరకు రాను రాను వినోదంగా మారేలా కని పిస్తోంది. దమ్ముంటే కిరణ్‌ తన ప్రభుత్వంపై అసెంబ్లీలో విశ్వాసం నిరూపించుకోవాలని జగన్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సవాల్‌ చేశారు. దానికి స్పందించిన మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి, పార్టీని సమర్థిస్తోన్న ఎమ్మెల్యేలు మాత్రం దమ్ముంటే మీరే అవిశ్వాస తీర్మానం పెట్టండని ప్రతి సవాల్‌ విసిరారు. వీటికంటే ముందు అసలు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి.. కాంగ్రెస్‌లో ఉంటూ జగన్‌ను సమర్ధిస్తున్న ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేసి ఈ వివాదానికి తెరలేపారు.

తాజాగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే అసలు పిల్లిమెడలో గంట కట్టేదెవరన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. తన తండ్రి ఏర్పాటుచేసిన ప్రభుత్వాన్ని తాను పడగొట్టనని, ఈ ప్రభుత్వం తన దయాభిక్షపైఆధారపడి పనిచేస్తుందని జగన్‌ చాలాకాలం క్రితమే ప్రకటించారు. జగన్‌ ప్రకటన అటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇటు మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాయి. జగన్‌ వెంట తిరుగుతున్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయకుండా , పార్టీని విమర్శించడం అనైతికమని ముఖ్యమంత్రి కిరణ్‌ వ్యాఖ్యానించారు. మంత్రి డీఎల్‌ మరో అడుగు ముందుకేసి, జగన్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు దమ్ముంటే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని సవాల్‌ విసిరారు. తాము దేనినయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

తాజాగా బుధవారం జగన్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సీఎల్పీ సాక్షిగా.. సీఎం కిరణ్‌కు సరికొత్త సవాల్‌ విసిరారు. దమ్ముంటే కిరణ్‌ తన ప్రభుత్వంపై విశ్వాస పరీక్ష పెట్టుకోవాలని, అప్పుడు ఎవరి సత్తా ఏమిటో తేలిపోతుందని సీఎంకు నేరుగా సవాల్‌ విసిరారు. అసలు ఈ వివాదం అంతా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజకీయ అవగాహనా రాహిత్యం వల్ల మొదలయిందన్న భావన పార్టీ వర్గాల్లో బలంగా ఉంది. ప్రభుత్వం సంక్షోభంలో ఉన్న సమయంలో, ఎమ్మెల్యేలు నిలువునా చీలిపోయిన వాస్తవం తెలిసి, తాను ఈ సంక్షోభాన్ని నివారించలేనని తెలిసినప్పటికీ ి రణ్‌ ఈవిధంగా జగన్‌ను, ఆయన వర్గాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడటం రాజకీయ అవగాహన, అనుభవ రాహిత్యమేనని పార్టీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. వివాదాన్ని చల్లార్చవలసిన బాధ్యత గల ముఖ్యమంత్రే దానిని మరింత పెద్దది చేయడం వల్ల కాంగ్రెస్‌ ప్రభుత్వానికే నష్టం వస్తుందన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయమని డిమాండ్‌ చేయడం, చేతులారా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు స్వాగతించడమేనని వ్యాఖ్యానిస్తున్నారు. కిరణ్‌ ప్రకటనలు హాస్యాస్పదంగా, రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వారిలా ఉన్నాయంటున్నారు.

ఈ పరిణామాలను లోతుగా పరిశీలిస్తే.. అసలు పిల్లిమెడలో గంటకట్టేదెవరన్న ప్రశ్న తెరపైకొస్తోంది. జగన్‌ వర్గం దమ్ముంటే మీపై విశ్వాస పరీక్ష పెట్టుకోమని సవాల్‌ విసురుతుందే తప్ప, తమంతట తాము అవిశ్వాసం పెడతామని చెప్పడం లేదు. పైగా ఈ వ్యవహారంతో సంబంధం లేని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని తెరపైకి తెచ్చి దానిని ఇరికించే ప్రయత్నం చేస్తోంది. టీడీపీ అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని నిలదీస్తోంది. దీన్ని బట్టి బాబు-కిరణ్‌ మధ్య మ్యాచ్‌ఫిక్సింగ్‌ ఉందన్న ప్రచారం చేస్తోంది. ఈ వాదన అర్థరహితమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అటు కిరణ్‌, మంత్రులు కూడా దమ్ముంటే అవిశ్వాస పరీక్ష పెట్టమని సవాల్‌ విసురుతున్నారే గానీ, తాము విశ్వాస పరీక్ష కోరతామని ఎక్కడా చెప్పడం లేదు. ఒకవేళ జగన్‌ వర్గం అవిశ్వాసతీర్మానం పెడితే.. ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలంతా అనర్హులవుతారు. పార్టీ విప్‌ను ధిక్కరిస్తే పదవి కోల్పోతారు. మరో మూడేళ్లు ఎమ్మెల్యే పదవులను వదులుకునేంత ధైర్యం జగన్‌ వర్గం ఎమ్మెల్యేలలో కనిపించడం లేదు. ప్రభుత్వం కూడా విశ్వాస పరీక్ష జరిపించుకుని, సమస్యలు కొని తెచ్చుకునే సాహసం చేయదు.మరికొద్దికాలం పాటు ఇలాగే ఇరు వర్గాలు సవాళ్లు, ప్రతి సవాళ్లతోనే కాలక్షేపం చేయడమే అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించాలని జగన్‌ గట్టిగా భావించినప్పుడు మాత్రమే ఆశ్చర్యకర పరిణామాలు చోటు చేసుకుంటాయి తప్ప, అప్పటివరకూ అంతా మీడియా హడావిడి తప్ప మరేమీ ఉండదని పార్టీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు. దీన్ని బట్టి.. ప్రభుత్వం గానీ, జగన్‌ వర్గం గానీ విశ్వాస/అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టబోరని స్పష్టంగా తేలిపోతుంది.

No comments:

Post a Comment