Wednesday, December 22, 2010

రైతు బాంధవుడు అనిపించుకోవాలన్న మీ లక్ష్యం నెరవేరింది కదా, ఇక దీక్ష విరమించండి * చంద్రబాబుకు కిరణ్‌కుమార్ విజ్ఞప్తి

జడ్చర్ల, డిసెంబర్ 22 : రైతు బాంధవుడు అనిపించుకోవాలన్న మీ లక్ష్యం నెరవేరింది కాబట్టి ఇకనైనా నిరాహార దీక్ష విరమించుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఇక ఆలస్యం చేయకుండా చంద్రబాబు దీక్ష విరమించుకోవాలని సభాముఖంగా కోరుతున్నట్టు ఆయన చెప్పారు.

బుధవారంనాడు జడ్చర్లలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు అమలుచేసిన రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వై.ఎస్.తో కలిసి తాము ప్రతిపక్షంలో ఉండగా 11 రోజులు దీక్ష చేస్తే అప్పుడు కనీసం పట్టించుకున్న నాథుడు లేరని గుర్తు చేశారు. జడ్చర్లలో వై.ఎస్. విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ముఖ్యమంత్రి ఆనాటి విషయాలను గుర్తు చేశారు.

ఇప్పటికే తాము రైతులకోసం ఎంతో చేశామని, ఇంకా చేస్తామని, అందుకు కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని ఆయన చెప్పారు. ఐదేళ్లలో మీరు ఇచ్చినదెంతో, మేము ఒక్క సంవత్సరంలోనే రైతులకు చేసిన సంక్షేమ కార్యక్రమాల విలువ ఎంతో బేరీజు వేసుకోవాలని సభాముఖంగా కోరుతున్నట్టు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ఐదరేళ్ళలో అంటే 2004 నుంచి 2010 వరకు వరదలకు, కరువులకుగాను మనకు 3,400 కోట్ల రూపాయల నిధులు వచ్చాయి. ఇప్పుడు తాజాగా కేంద్రం ఈ భారీ వర్షాల నష్టపోయిన రైతులకోసం 400 కోట్ల రూపాయలను ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్లో 2004 నుంచి 3,200 కోట్లు ఖర్చుపెట్టాం. అంటే గత ఐదేళ్ళలో 6,600 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాం. అదిగాక రైతుల కోసం మరో వెయ్యి కోట్లు మంగళవారం ప్రక టించాం. అంటే సుమారు రూ. 7,600 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చుపెడితే తెలుగుదేశంపార్టీ తమ తొమ్మిదేళ్ళ పాలనలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రూ. 1600 కోట్లు కాక 33 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టింది. దీనిని బట్టి మీరు అర్ధం చేసుకోండి ఎవరు రైతు బాంధవుడు, ఎవరు రైతు పక్షపాతి అని - ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలని సీఎం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఐదేళ్ళలో 8,000 కోట్లు ఖర్చుపెట్టిన మేము రైతుబాంధవులమా, తొమ్మిదేళ్ళలో 33 కోట్లు ఖర్చుపెట్టిన వారు రైతు బాంధవులా మరొక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలని కోరుతున్నాను అని ఆయన పునరుద్ఘాటించారు.

రాష్ట్రంలో సమస్య ఎక్కువగా ఉంది. అందులో విభేదించేది లేదు. పంటలుపోయి రైతులు చాలా నష్టపోయారు. రైతులు నష్టపోయినదానికి వీలైనంత వరకు ఈ ప్రభుత్వం సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. నేను మరోమారు చంద్రబాబును కోరుతున్నా - మీరు ప్రజల దృష్టిని ఆకర్షించడానికి చేసిన దీక్ష ప్రజల దృష్టికి వచ్చింది. ప్రజల దగ్గర రైతుబాంధవుడిగా చెప్పుకునేందుకు మీ లక్ష్యం నెరవేరింది. అందుచేత దేనికోసమైతే నిరాహారదీక్ష చేస్తున్నారో అది నెరవేరినందువల్ల దీక్ష విరమించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు అంటే అభిమానం ఉంది, ఒక ప్రతిపక్ష నాయకుడిగా మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుతం ఇచ్చిన దానికంటే మెరుగైన ప్యాకేజీ ఇచ్చే పరిస్థితి ప్రభుత్వానికి ఉంటే అలాగే ఇచ్చేవాళ్ళమని, ఇచ్చే పరిస్థితి లేదని, ఎటువంటి భేషాజాలకు పోవలసిన అవసరం లేదని కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

చంద్రబాబు చేసిన రైతు వ్యతిరేక కార్యక్రమాలను ఎదుర్కొని తొమ్మిదేళ్ళు పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలకు మేలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, అటువంటిది మనం చెడు చేసుకునే పరిస్థితి రాకూడదని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన అన్నారు. గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్క కార్యకర్త ఇటిక ఇటిక కూడబెట్టి పునాదిని గట్టి చేసి, ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి కృషి చేశారని ఆయన చెప్పారు.

ఈ ప్రభుత్వం ఉందంటే ఇది మీ ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, మీరు తెచ్చిన ప్రభుత్వం, ఇది నాయకులు తెచ్చిన ప్రభుత్వం కాదు, కార్యకర్తలు మీరు కష్టపడి తీసుకొచ్చిన ప్రభుత్వం. అందుచేత దీన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. ప్రజలకు మేలు చేయాలని మమ్మల్ని మీరు నిలబెట్టారు. ఆ నమ్మకం ఉంచి, మీకు తలవంచి ప్రజలకు సేవ చేయడానికి కృషి చేస్తానని మనవి చేస్తున్నాను.

ఇది గాక ఇంకొక ప్రధానాంశం - దివంగత రాజశేఖర్‌రెడ్డి 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ పునాదిని నెలబెట్టడానికి ఎంతో కష్టపడి పాదయాత్రచేసి ఎంతో కృషి చేశారు. దానికి మనమంతా సహకరించడం జరిగింది. అందుచేత వై.ఎస్.కు సోనియాగాంధీ దగ్గర ఒక ప్రత్యేక స్థానం ఉండేది. మేమందరం కూడా గౌరవించే వ్యక్తి ఆయన. కానీ కాంగ్రెస్ పార్టీని వదిలిపోయే నాయకులు చాలామంది ఉన్నారు. అలాగే తిరిగి వచ్చినవాళ్లు ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునాది గట్టిగా ఉంది అని ఆయన చెప్పారు. త్వరలోనే రచ్చబండ కార్యక్రమం మొదలుబెట్టబోతున్నామని కూడా కిరణ్ ప్రకటించారు.

click here

No comments:

Post a Comment